కరీంనగర్ కార్పొరేషన్: తీగలగుట్టపల్లి రైల్వేగేట్ వద్ద అధ్వానంగా మారిన రోడ్డు పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. దుమ్ము, గుంతలతో నిత్యం నరకం చూస్తున్న ప్రయాణికులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు మేయర్ కొలగాని శ్రీనివాస్ చర్యలు చేపట్టారు. ఆర్అండ్బీ నిధుల సమస్యతో ముందుకు రాకపోవడంతో, నగరపాలకసంస్థ నుంచి రోడ్డు వేసేందుకు నిర్ణయించారు. నగరపాలకసంస్థ సాధారణ నిధులు రూ.33 లక్షలతో చేపట్టనున్న తారురోడ్డుకు ఆదివారం డిప్యూటీ మేయర్ వై.సునీల్రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. రైల్వే గేట్ రోడ్డులో ప్రజలు పడుతున్న కష్టాలు చూడలేకే నగరపాలకసంస్థ నుంచి రోడ్డు పనులు చేపట్టామని మేయర్ తెలిపారు. రోడ్డు నిర్మాణానికి నిధుల కొరత ఉందని ఆర్అండ్బీ అధికారులు చెప్పడంతో నగరపాలకసంస్థ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో సేతుబంధన్ స్కీం కింద ఆర్వోబీ నిర్మాణానికి దాదాపు రూ.150 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. ఆ నిధులతో ఆర్వోబీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. కార్పొరేటర్లు సాదినేని లావణ్య, బారి అపర్ణ, ఈఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.


