● నాంపల్లిగుట్టపై ప్రత్యేక ఏర్పాట్లు ● ఇప్పటికే ఆకట్టుకుంటున్న కాళీయమర్ధనం ● త్వరలో అందుబాటులోకి ఎయిర్ఫోర్స్ విమానం
వేములవాడఅర్బన్: ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ పట్టణంతో నాంపల్లిగుట్ట ఆధ్యాత్మికంగా.. పర్యాటకంగా ఆకట్టుకుంటుంది. దీనికితోడు తాజాగా గుట్టపైన ఎయిర్ఫోర్స్ విమానాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే గుట్టకు మరింత అందం చేకూరనుంది.
గరుడ వాహనంపై ఊరేగింపు
శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో పలు చోట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆయా సమయాల్లో స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగిస్తుంటారు. పక్షులకు రాజైన గరుడవాహనంపై స్వామివారిని ఊరేగించడం భక్తులకు కనువిందు చేస్తుంది. ఈక్రమంలోనే నాంపల్లిగుట్టపై గాలిలో వెళ్లే లోహపు పిట్ట(విమానం) ఏర్పాటు చేస్తున్నారని స్థానిక పెద్దలు చర్చించుకుంటున్నారు.
గుట్టపై కాళీయమర్ధనం
అప్పటి ఎంపీ విద్యాసాగర్రావు హయాంలో నాంపల్లిగుట్ట అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు వెచ్చించారు. ఘాట్రోడ్డు, కాళీయమర్ధనం, వాటర్ ఫౌంటేయిన్లు ఏర్పాటు చేశారు. గుట్టపై ఏర్పాటు చేసిన కాళీయమర్ధనం ఆకర్షణీయంగా నిలిచింది.
ఎయిర్ఫోర్స్ విమానం.. అదనపు ఆకర్షణ
నాంపల్లిగుట్టపై భక్తులకు ఆహ్లాదం పంచేందుకు వీటీడీఏ అధికారులు రెండేళ్లుగా ఎయిర్ఫోర్స్ విమానం ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. ఎట్టకేలకు గుట్టపైకి ఎయిర్ఫోర్స్ విమానాన్ని తీసుకొచ్చారు. వాటి పనులు ప్రారంభించి పూర్తి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ విమానాన్ని చూసేందుకు స్థానికులు గుట్టపైకి వస్తున్నారు. త్వరలోనే ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.


