బెస్ట్ అవైలేబుల్ స్కూళ్లలో రెండు పద్ధతులు ఇబ్బందుల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులు యాజమాన్యం మార్పుతో రోడ్డునపడుతున్న మరికొందరు
పెద్దపల్లి: జిల్లాలోని కొన్ని బెస్ట్ అవైలేబుల్ స్కూళ్లలో విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ విద్యార్థులతో కాకుండా ఉచితంగా సీట్లు పొందిన వారిని వేరుగా కూర్చోబెట్టి చదువు చెబుదున్నారని పేర్కొంటున్నారు. అంతేకాదు.. స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పోటీల్లోనూ వీరికి అవకాశం కల్పించడం లేదంటున్నారు. జిల్లాలోని 12 ప్రైవేట్ స్కూళ్లలో బెస్ట్అవైలేబుల్ కింద 587 మంది విద్యార్థులను చేర్చుకోగా.. వారిపై యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయనే విమర్శలు రావడంతో విద్యాభిమానులు నివ్వెరపోతున్నారు.
కలెక్టర్కు తల్లిదండ్రుల మొర
ఎన్టీపీసీ ప్రాంతంలోని విశ్వభారతి హైస్కూల్లో 133 మంది విద్యార్థులు బెస్ట్ అవైలేబుల్ ద్వారా సీట్లు పొందారని, వీరిని పలు ప్రాంతాల్లోని వివిధ స్కూళ్లలో చదివిస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారనే దానిపై విచారణ జరిపించాలని అధికారులను కోరుతున్నారు. ఇప్పటివరకు విద్యార్థులను ఆ పాఠశాలలో అనుమతించకపోగా, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బెల్ట్లు, టై, షూస్ను సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాలని యాజమాన్యం పేరెంట్స్కు సూచించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి, ఇటీవల కలెక్టరేట్కు చేరకున్నారు. ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
కొత్త మేనేజ్మెంట్ షరతులు
2026– 27 విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు పదిరోజులు గడుస్తోంది. అయినా సుమారు 20 మంది విద్యార్థులు ఇంకా తరగతులకు హాజరు కావడంలేదు. కొత్త యాజమాన్యం(రెండు దశాబ్దాల పాటు నడిచిన స్కూల్ను సొంతం చేసుకున్న మేనేజ్మెంట్) బెస్ట్ అవైలేబుల్ విద్యార్థులను స్కూల్కు రానివ్వడం లేదంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. కలెక్టర్ నుంచి లేఖ తీసుకురావాలని షరతు పెట్టిందని పేర్కొంటున్నారు. బెస్ట్ అవైలేబుల్ స్కూల్ విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి, పుస్తకాలు, యూనిఫామ్స్ వంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ సదరు కొత్త మేనేజ్మెంట్ ఇందుకు విముఖత చూపడం విమర్శలకు తావిస్తోంది.
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు..
ప్రైవేట్ స్కూళ్లలో బెస్ట్ అవైలేబుల్ సీట్లు పొందేవారంతా పేదలు, వెనుకబడిన వర్గాల వారే. హఠాత్తుగా యాజమాన్యం మారడంతో వీరి చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు నిర్వహించిన పాఠశాల(బెస్ట్ అవైలేబుల్ స్కూల్ కూడా) యాజమాన్యం ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకుంది. దీనిని సిద్ధార్థ యాజమాన్యం కొనుగోలు చేసింది. పేరు కూడా మార్చేసింది. బెస్ట్ అవైలేబుల్ స్కూల్గా ఉన్న సమయంలో 6 నుంచి పదో తరగతి వరకు ప్రతీ తరగతిలో నలుగురి నుంచి ఐదుగురు విద్యార్థులు ఉచితంగా సీట్లు కేటాయించింది. ప్రభుత్వం వారి ఫీజులు చెల్లించేది.


