చొప్పదండి: మండలంలోని ఆర్నకొండకు చెందిన గుంట మహేశ్ (25) ట్రాలీ ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్ఐ నరేశ్ రెడ్డి కథనం ప్రకారం మహేశ్ బుధవారం చొప్పదండిలోని మర్లవాడలో అమరగొండ సురేశ్ కూతరు వివాహ వేడుకలకు హాజరయ్యాడు. రాత్రి బరాత్లో పాల్గొని 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు వెంట ఇంటికి నడుచుకుంటు ఆర్నకొండ వైపు వెళ్తుండగా చొప్పదండి నుంచి ధర్మారం వెళ్తున్న ట్రాలీ ఆటో మర్లవాడ వద్ద ఢీకొట్టింది. దీంతో మహేశ్ కిందపడిపోవడంతో స్థానికులు వెంటనే కరీంనగర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. మృతుడి తండ్రి బీరయ్య ఫిర్యాదు మేరకు ట్రాలీ అటో డ్రైవర్ గుమ్మడి తిరుపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
పుట్టపాక గ్రామంలో అదుపుతప్పిన కారు
● ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు
మంథనిరూరల్: పెద్దపల్లి– మంథని ప్రధాన రహదారి మంథని మండలం పుట్టపాక సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దపల్లి గ్రామానికి చెందిన ఏల్పుల మణికంఠ(25) మృతి చెందాడు. వివరాలు.. సిద్దపల్లి గ్రామానికి చెందిన మణికంఠ బిట్టుపల్లికి చెందిన మిత్రుడిని మరికొంతమంది మిత్రులతో కలిసి కారులో దిగబెట్టడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పుట్టపాక గ్రామ పంచాయతీ పరిధి చల్లపల్లి స్టేజీ వద్ద కారు అదుపుతప్పి సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న షెడ్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మణికంఠ అక్కడికక్కడే మృతి చెందగా రాహుల్, ఆకాశ్, అనిల్ గాయపడ్డారు. వీరిని పెద్దపల్లికి.. అక్కడి నుంచి కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్నామని ఏఎస్ఐ మల్లయ్య తెలిపారు.
గీత కార్మికుడి ఆత్మహత్య
హుజూరాబాద్: హుజూరాబాద్కు చెందిన పంజాల భిక్షపతి గౌడ్ (48) అనే గీతకార్మికుడు బుధవారం రాత్రి శ్మశాన వాటికలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడని..మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. భార్య శారద ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


