వెల్గటూర్: ఎండపల్లి మండలం గొడిశెలపేటలో పిచ్చికుక్కలు బుధవారం వీరంగం సృష్టించాయి. సుమారు 12 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో గాయపడ్డవారిలో చీకట్ల పోచయ్య, మోకేనపల్లి విజయ, దొంత నర్సయ్య, బత్తుల లచ్చవ్వ, గుడిసెల నర్సవ, కాంపెళ్లి రాజయ్యతోపాటు మరికొందరు ఉన్నారు. బాధితులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మేకలమందపై చిరుతదాడి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండా శివారు అటవీ ప్రాంతంలో బుధవారం మేకలమందపై చిరుత దాడి చేసింది. కాపరి దూరం నుంచి చిరుతను చూసి తండాకు పరుగులు పెట్టాడు. గ్రామస్తులకు విషయం తెలపడంతో కర్రలతో తండావాసులు పెద్దసంఖ్యలో అటవీప్రాంతానికి చేరుకోగా అప్పటికే చిరుత పరారైంది.
ధాన్యం కొనుగోలు ఉల్లంఘనపై ఫిర్యాదు
మంథని: మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో సేకరించినట్లు సృష్టించి రైస్ మిల్లుకు తరలించిన అక్రమ దందాపై ఎట్టకేలకు బాధ్యులపై చర్యలకు అధికారులు మందుకు వచ్చారు. ధాన్యం అక్రమ రవాణాలో పాత్రధారులుగా విచారణలో తేలిన పీపీసీ ఇన్చార్జి, ట్యాబ్ ఆపరేటర్, స్టాఫ్ అసిస్టెంట్, పీఏసీఎస్ సిబ్బంది, వాహన యజమానులు, డ్రైవర్లు, స్టాఫ్ అసిస్టెంట్ సోదరుడితో పాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలని బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాల తయారీ, నమ్మకద్రోహం, కుట్ర వంటి తీవ్రమైన నేరాలతోపాటు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.


