చిగురుమామిడి: మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన రైతు కుందేళ్ళ వెంకటయ్య (48) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వెంకటయ్య ఆదివారం తన పొలంలో పనులు చేస్తుండగా ఎండ వేడి తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే వెంకటయ్య ఆదివారం మృతిచెందినట్లు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గౌరయ్య తెలిపారు. సోమవారం మృతుడి కొడుకు మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించినట్లు వివరించారు.
కరీంనగర్క్రైం: కరీంనగర్ నగరంలో ఓ వృద్ధురాలు బావిలో పడి మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. శర్మనగర్కు చెందిన నలుమాచు సుగుణమ్మ (80) వయసు మీద పడడంతో కళ్లు, చెవులు సరిగా పనిచేయడం లేదు. సోమవారం వేకువజామున ఇంట్లో వాళ్లు నిద్రలేచి చూసేసరికి సుగుణమ్మ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఇంట్లోని బావిలో చూసేసరికి కనిపించింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు: ముగ్గురికి గాయాలు
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు.. జగిత్యాల–కరీంనగర్ రహదారిపై సోమవారం వేకువజామున ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు కొండగట్టు సమీపంలో అదుపు తప్పి, విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో కోరుట్లకు చెందిన నాగరాజు, అనిల్, మహమ్మద్ గాయపడ్డారు. బాధితులను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


