చిగురుమామిడి: దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేయడానికి ప్రధాని నరేంద్రమోదీ కారణమని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం చిగురుమామిడిలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో పార్టీ మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వెంకట్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటికి దేశంలో రూ.55 లక్షల కోట్ల అప్పులుంటే 12ఏళ్లకాలంలో రూ.214 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను 40శాతం రాష్ట్రాలే ఇవ్వాలని ప్రధాని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్నస్వామి, బూడిద సదాశివ, మావురపు రాజు, తేరాల సత్యనారాయణ, పైడిపెల్లి వెంకటేశ్ పాల్గొన్నారు.


