● అమృత్ 2.0లో రూ.13 కోట్లు మంజూరు ● బాలానగర్లో కొనసాగుతున్న వాటర్ట్యాంక్ ● మిషన్ భగీరథ పైపుల లీకేజీ ● వేములవాడలో తీవ్రమైన నీటి కష్టాలు ● పూర్తికాని పనులు.. అందని తాగునీరు
వేములవాడఅర్బన్: వేములవాడ పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 నిధులు మంజూరు చేసి ఏళ్లు గడుస్తోంది. కానీ పనులు మాత్రం కొస ముట్టలేవు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తుండగా.. నీరు అందని కాలనీలకు ఈ అమృత్ నిధులతో నీటిని అందించాలని భావించారు. పట్టణంలో మిషన్ భగీరథ పైపుల లీకేజీతో జలాలు వృథా అవుతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు. రిపేర్లు చేయకుండా మూడు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చాల్సిన మిషన్ భగీరథ నీళ్లు రోడ్డు పాలవుతుండగా.. అమృత్ 2.0 పనులు జాప్యమవుతున్నాయి.
రూ.13కోట్లతో పనులు
వేములవాడ మున్సిపల్కు అమృత్ 2.0లో భాగంగా రూ.13 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలోని బాలానగర్లో తాగునీటికి ఇబ్బందిగా ఉండటంతో 8 వేల కేఏల్ సామర్థ్యంతో వాటర్ట్యాంక్ను నిర్మిస్తున్నారు. ఇంకా పనులు పూర్తి కాలేదు.
పైపులైన్ పనులు పూర్తి
అగ్రహారం ఫిల్టర్బెడ్ నుంచి నాంపల్లి మీదుగా వేములవాడలోని మహాలక్ష్మి కాలనీ వరకు మిషన్ భగీరథ పైపులైన్ను గతంలోనే వేశారు. ఆ పైపులైన్ నుంచి బాలానగర్ నూతన వాటర్ ట్యాంక్ వరకు పైపులైన్ వేశారు. ఆ ట్యాంక్ నుంచి అవుట్లైన్లు కూడా ఇచ్చారు. మొత్తం పైపులైన్లు సుమారు 18 కిలోమీటర్లు వేసినట్లు తెలిపారు. పైపులైన్లు లేని చోట తాగునీటికి ఇబ్బందిగా ఉంటే ఈ నిధుల నుంచి వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
త్వరలో పూర్తిచేస్తాం
అమృత్ నిధులతో పట్టణంలోని బాలానగర్లో వాటర్ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. ట్యాంక్కు ఇన్, అవుట్ పైపులైన్లు వేశాం. ఈ పనులు జూలై చివరి వరకు పూర్తి చేసి తాగునీరు అందిస్తాం. పట్టణంలోని పైపులైన్లు లేని చోట కొత్తగా వేస్తాం.
– అనన్య, వేములవాడ, పబ్లిక్ హెల్త్ ఏఈ


