కరీంనగర్ క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. గురువారం కమిషనరేట్ కేంద్రంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, పొక్సో, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, తీవ్రమైన నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. నేరస్తులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలన్నారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా చర్చించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. ఏసీపీలు శ్రీనివాస్, జి.విజయ్ కుమార్, వెంకటస్వామి, యాదగిరిస్వామి, మాధవి, వేణుగోపాల్, వాసాల సతీశ్, ప్రతాప్ పాల్గొన్నారు.


