రూ.2వేల కోట్ల కుంభకోణంపై సిట్‌ వేయాలి | - | Sakshi
Sakshi News home page

రూ.2వేల కోట్ల కుంభకోణంపై సిట్‌ వేయాలి

Jun 19 2026 1:18 AM | Updated on Jun 19 2026 1:18 AM

● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

కరీంనగర్‌టౌన్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, బూట్లు, టైలు, ప్లేట్లు తదితర వస్తువుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన దాదాపు రూ.2వేల కోట్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. కరీంనగర్‌లో గురువారం మాట్లాడుతూ టెండర్లలో అవకతవకలు జరిగాయని హరీశ్‌రావు, ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ ఆధారాలతో ఆరోపించారని గుర్తు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా ఉలిక్కిపడి సమాధానం చెప్పడానికి జంకుతున్నారని విమర్శించారు. టెండర్లలో ఎలాంటి తప్పు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సిట్‌, రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవడం మానేసి, హరీశ్‌రావు, ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌లపై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. కులాల పేరుతో రాజకీయాలు చేయడం బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారికి తగదని హెచ్చరించారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, లేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘువీర్‌సింగ్‌, సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాంరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement