గతంలో విద్యార్థులు లేకపోవడంతో వీణవంక మండలం మల్లన్నపల్లె ప్రాథమిక పాఠశాల మూతబడింది. సోమవారం డీఈవో ప్రశాంత్రెడ్డి చేతులమీదుగా రీ ఓపెన్ చేసి 19 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎంపీడీవో రాము, తహసీల్దార్ రజిత, ఎంఈవో ప్రభాకర్రావు ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో సరస్వతి విగ్రహ ఆవిష్కరణ చేశారు. జిల్లా కేంద్రంలోని ధన్గర్వాడీ, సప్తగిరికాలనీ, కార్ఖానగడ్డ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూలు అందజేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఈవో వీణవంక, జమ్మికుంట మండలాల్లో పాఠశాలలను విజిట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, మెరుగైన వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఉచిత పుస్తకాలు అందజేయడంతో పాటు రుచికరమైన భోజనం, అనుభవం గల ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ బడులను బలోపేతం చేయాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందన్నారు. హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి నియోజక వర్గాల్లోని ఆయా మండలాల్లో ఎంఈవోలు, హెచ్ఎంల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఘన స్వాగతం పలికి దుస్తులు, పుస్తకాలు అందజేశారు.


