ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై విచారణ జరిపించాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై విచారణ జరిపించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ చిత్రామిశ్రకు లేఖ రాశారు. నగరంలో ఎలాంటి అనుభవం లేని వ్యక్తుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ప్రైవేట్ ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. అర్హత లేని డాక్టర్లు, సిబ్బందిని తక్కువ జీతాలకు పెట్టుకుని వారితో శస్త్రచికిత్సలు చేయిస్తున్నారని ఆరోపించారు. చిన్న జ్వరం వచ్చి చికిత్స కోసం డాక్టర్ను సంప్రదిస్తే అనవసర పరీక్షలు రాసి రూ.లక్షల్లో బిల్లులు వేసి దోచుకుంటున్నారని ఆరోపించారు.
భగీరథ్ను ఎందుకు
అరెస్టు చేయరు?
కరీంనగర్ టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు అయినప్పటికీ.. ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్లో గురువారం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జీల సమావేశం జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేసి, అతనికి తప్పించుకునే అవకాశం కల్పించిందని ప్రజలు భావిస్తున్నరని ఆరోపించారు. భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శాంతియుత ధర్నా కోసం దరఖాస్తు చేస్తే సీపీ నిరాకరించారని తెలిపారు. ధర్నా కోసం హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
వర్సిటీని అభివృద్ధి చేస్తాం
కరీంనగర్ సిటీ: ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని వీసీ ఉమేశ్కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వారోత్సవాల సందర్భంగా శాతవాహన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో శాతవాహన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రస్టుకు అధ్యక్షుడిగా వీసీ వ్యవహరిస్తారన్నారు. ట్రస్ట్ సెక్రటరీ రిజిస్టార్ సతీశ్కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బుర్ర మధుసూదన్రెడ్డి, జాయింట్ సెక్రటరీ దీపిక, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి
కృషిచేస్తాం: మెప్మా పీడీ
కరీంనగర్ కార్పొరేషన్: మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడమే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లక్ష్యమని పీడీ స్వరూపరాణి అన్నారు. సీఓలు, ఆర్పీలు, టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్)తో గురువారం సమీక్షించారు. వార్డుస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలను ఆర్పీలు, సీఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల్లో అలసత్వం వద్దని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు
కరీంనగర్ టౌన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి నాన్ రెసిడెన్షియల్, 5వ తరగతి రెసిడెన్షియల్లో ప్రవేశానికి షెడ్యూల్డు కుల విద్యార్థ్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు వై.తిరుపతిరావు తెలిపారు. దరఖాస్తులను జూన్ 6వ తేదీ సాయంత్రం 5గంటల లోపు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.


