కరీంనగర్ అర్బన్/కరీంనగర్ టౌన్: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, ముస్లిం మత పెద్దలతో బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముస్లింలు బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈద్గాల వద్ద అవసరమైన వసతులు కల్పించడంతో పాటు నమాజ్ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. సీపీ గౌస్ఆలం మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్డీవోలు కే.మహేశ్వర్, రమేశ్బాబు పాల్గొన్నారు.
అత్యుత్తమ సేవలకు కేరాఫ్గా సర్కారు ఆస్పత్రి
అత్యుత్తమ సేవలకు కేరాఫ్ అడ్రస్గా ప్రభుత్వ ఆసుపత్రులు నిలవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రభుత్వ హాస్పిటళ్ల బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలతో వైద్య శాఖ మరింత అనుసంధానం కావాలని, ప్రభుత్వ ఆసుపత్రులు అత్యుత్తమ వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలవాలని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఎంహెచ్వో వెంకటరమణ, కేశవరెడ్డి పాల్గొన్నారు.


