
కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
జ్యోతినగర్(రామగుండం): పరిశ్రమల్లో విధులు నిర్వహించే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్షిప్ యూనియన్ కార్యాలయంలో జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికవర్గం విజయవంతం చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23న యాజమాన్యాలకు సమ్మె నోటీసు అందించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ సంఘాల ఆధ్వర్యంలో జులై9న దేశవ్యాప్తంగా 13వ సారి జరగనున్న సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, నాంసాని శంకర్, చిలుక శంకర్, రెడపాక లక్ష్మణ్, నాగభూషణం, గీట్ల లక్ష్మారెడ్డి, బొద్దున రాజేశం, ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు ఆరెపల్లి రాజేశ్వర్, వేముల కృష్ణయ్య పాల్గొన్నారు.
స్వగ్రామానికి మృతదేహం
పెగడపల్లి: ఉపాధి కోసం దుబాయి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఓ వలసజీవి మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. మండలంలోని బతికపల్లికి చెందిన పూడూరి లచ్చన్న (46) జీవనోపాధి కోసం దుబాయి వెళ్లాడు. తాను పని చేస్తున్న కంపెనీలో సరైన వేతనం లభించక కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన లచ్చన్న వారంక్రితం తాను ఉంటున్న గదిలో ఉరేసుకున్నాడు. గల్ఫ్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు గుండెల్లి నరసింహ, ఎన్ఆర్ఐ పాలసీ అడ్వైజరీ కమిటీ ఉపాధ్యక్షుడు మంద బీంరెడ్డి సహకారంతో ఆయన మృతదేహం ఇంటికి చేరింది. విగతజీవిగా వచ్చిన లచ్చన్నను చూసిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. లచ్చన్నకు భార్య లత, ఇద్దరు కుమారులున్నారు.

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి