
పెళ్లింట విషాదం
● నెల రోజులు గడవకుండానే నవవరుడి మృతి ● చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న కుటుంబం
వేములవాడ: పెళ్లయి నెల రోజులు గడవకముందే నవవరుడి మృతి ఆ ఇంట్లో విషాదం నింపింది. మద్యం మత్తులో ఉన్న కరీంనగర్ శివారులోని రేకుర్తికి చెందిన వ్యక్తి అజాగ్రత్తగా.. అతివేగంగా కారుతో ఢీకొట్టడంతో వేములవాడకు చెందిన పండరీనాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మే 23న పండరీనాథ్(25) వివాహమైంది. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఓ వేడుకకు హాజరైన పండరీనాథ్ అంతలోనే చనిపోయాడని తెలియడంతో వారి రోదనలు మిన్నంటాయి. మద్యం మత్తులో ఉన్న కారుడ్రైవర్ అప్పటికే రెండు చోట్ల ప్రమాదాలు చేసినట్లు తెలిసింది.
పెళ్లయిన 25 రోజులకే మృతి
మే నెలలో పెళ్లితో కళకళలాడిన ఇల్లు గురువారం శోకసంద్రంగా మారింది. ఇటీవల పెళ్లి బంధానికి తాలూకు వేడుకలు, ఫోటోలు ఇంకా ఇంటి గోడలపై వేలాడుతుండగానే.. అదే ఇంట్లో అంత్యక్రియల ఏర్పాట్లు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. తాత, నానమ్మ, తల్లి, తండ్రిని ఓదార్చే బంధువులు కన్నీరు ఆపులేకపోయారు. నెల రోజుల్లోనే భర్తను కోల్పోయిన వధువు నిలువునా కూలిపోయింది. ఆమె రోదనలకు అంతులేకుండా పోయింది.