ఇంటికి దారేది? | - | Sakshi
Sakshi News home page

ఇంటికి దారేది?

Apr 30 2025 2:00 AM | Updated on Apr 30 2025 2:00 AM

ఇంటిక

ఇంటికి దారేది?

● నగరంలో పలుచోట్ల ఇళ్ల ఎదుట తవ్వకాలు ● గత ప్రభుత్వంలో డ్రైనేజీ, రోడ్ల పనులు ప్రారంభం ● అలాగే వదిలేసి ఏడాదిన్నర ● పట్టించుకోని ప్రస్తుత పాలకులు ● ఇబ్బంది పడుతున్న ప్రజలు

నగర శివారు ఉన్న అలకాపురికాలనీ ఇది. స్మార్ట్‌సిటీలో భాగంగా నగరం అద్దంలా మెరిసిపోతుండగా.. ఈ ప్రాంతం రోడ్డు, డ్రైనేజీ లేక వెలవెలబోతోంది. రోడ్డు, డ్రైనేజీ వేస్తామన్న గత పాలకులు పనులు ప్రారంభించగా.. తరువాత జరిగిన పరిణామాలతో వదిలేశారు. దీంతో ఈ కాలనీవాసులు తమ ఇండ్లకు దారిలేక ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ లేక ఇళ్లలోని మురుగునీరు రోడ్డుపైకి చేరుతోందని చెబుతున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఇలా తడకలు వేసుకున్నారు. డ్రైనేజీ రోడ్డుపై పారుతోంది.

ఈ చిత్రం నగరంలోని జ్యోతినగర్‌లోని. నిత్యం రద్దీ ఉండే ప్రాంతం ఇది. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన ఈ ఏరియాలో రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను విస్తరిస్తామని గత పాలకులు పనులు ప్రారంభించారు. కొద్దిరోజులకే ఎన్నికలు రావడంతో డ్రైనేజీ తవ్వి వదలేదశారు. కొంతదూరం పనులు పూర్తి చేశారు. రోడ్డు పనులు మరిచారు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఇళ్లలోకి వెళ్లేందుకు ఇలా తడకలు వేసుకుని కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు వృద్ధులు అయితే ఇంట్లోంచి బయటికి వెళ్లేందుకు భయపడుతున్నారు.

నగరంలోని కోతిరాంపూర్‌లో ఉన్న కాలనీ ఇది. ఇక్కడ రోడ్డు, డ్రైనేజీ వేస్తామని గత ప్రభుత్వ హయాంలో పాలకులు పనులు ప్రారంభించారు. ఇళ్ల ఎదుట రోడ్లు తవ్వారు. కంకర పోశారు. డ్రైనేజీ కోసం కందకం తవ్వారు. ఇంతలో సర్కారు మారడంలో అలాగే వదిలేశారు. రెండేళ్లుగా తవ్విన రోడ్డుపైనే కాలనీవాసులు నడుస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లేందుకు దారిలేక చెక్కలు వేసుకుని సర్కస్‌ఫీట్లు వేస్తున్నారు. బండ్లు బయట పెడుతుంటే.. చోరీకి గురవుతున్నాయని చెబుతున్నారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌:

కొత్త రోడ్లు వేస్తున్నామని పాతరోడ్లు తవ్వేశారు. డ్రైనేజీల కోసం ఇండ్ల ఎదుట కాలువలు తవ్వారు. ఇక కొత్త డ్రైనేజీలు, రోడ్లతో సమస్యలు తీరుతున్నాయని అంతా మురిసిపోయారు. కానీ జరిగిన పరిణామాలతో తవ్విన పనులు తవ్వినట్లే నిలిపివేసి ఏడాదిన్నర దాటింది. ప్రభుత్వ మారినా పనుల్లో కదలికలేదు. దీంతో నగరంలోని ఆయా కాలనీవాసుల పరిస్థితి పేనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్లయింది. గత ప్రభుత్వ హయాంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) కింద అంతర్గత రోడ్లతో పాటు, డ్రైనేజీల పనులు చేపట్టారు. రోడ్లు, డ్రైనేజీల కోసం ఇండ్ల ఎదుట తవ్వడం పనులు జరుగుతుండగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఆ వెంటనే కాంట్రాక్టర్‌ ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. 2023 డిసెంబర్‌లో నిలిపివేసిన పనుల్లో ఇప్పటివరకు కదలిక లేకుండా పోయింది.

ఇండ్ల ఎదుట కాలువలు

డ్రైనేజీ నిర్మాణాల కోసం ఇండ్ల ఎదుట కాలువలు తవ్వి వదిలివేయడంతో ఇండ్లల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో చాలా మంది తాత్కాలికంగా పాత తలుపులు, చెక్కలు కాలువలపై వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. ఏడాదిన్నరగా ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడుస్తుండడంతో మరికొంతమంది కాలువలను పూడ్చి వేసి తాత్కాలికంగా రాకపోకలకు దారి వేసుకున్నారు. మురుగునీరంతా అక్కడే నిలిచిపోవడంతో మరో సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది.

తాత్కాలిక ఏర్పాట్లైనా చేయాలి

పనులు అసంపూర్తిగా నిలిపివేయడంతో కోతిరాంపూర్‌, అలకాపురికాలనీ, జ్యోతినగర్‌, ఆరెపల్లి, సీతారాంపూర్‌, తీగలగుట్టపల్లి, కిసాన్‌నగర్‌, లక్ష్మినగర్‌, పోచమ్మవాడ తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా కనీసం పట్టించుకొనేవాళ్లు లేకపోవడంపై మండిపడుతున్నారు. ఇండ్లకు వెళ్లేందుకు, మురుగునీళ్లు నిలవకుండా నగరపాలకసంస్థ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లైనా చేయాలని కోరుతున్నారు.

ఈ బాధలు ఇంకెన్ని రోజులు?

డ్రైనేజీ కడుతామని మా ఇంటి ముందు కాలువ తవ్వి రెండేళ్లవుతోంది. ఇప్పటివరకు పనులు కొనసాగించడం లేదు. కాలువ పైనుంచి పాత తలుపు చెక్కలు వేసుకుని నడుస్తున్నాం. కాలువను పూడ్చివేద్దామంటే పైనుంచి వచ్చే మురుగునీళ్లు మా ఇంటి వద్దే నిలిచిపోతోంది. ఇంటినుంచి బయటకు రావడానికి, పోవడానికి బాధలు తప్పడం లేదు. రాత్రుళ్లు అయితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోంది.

– సంగని పద్మ, మొగిలయ్య, అలకాపురి

ఇంటికి దారేది?1
1/4

ఇంటికి దారేది?

ఇంటికి దారేది?2
2/4

ఇంటికి దారేది?

ఇంటికి దారేది?3
3/4

ఇంటికి దారేది?

ఇంటికి దారేది?4
4/4

ఇంటికి దారేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement