
రేషన్ డీలర్ల పరీక్ష ప్రశాంతం
కరీంనగర్ అర్బన్: రేషన్ డీలర్ల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో తొలి విడత 68 రేషన్ దుకాణాలకు గానూ ప్రకటన వెలువడగా 415 మంది దరఖాస్తు చేసుకున్నారు. గురువారం జ్యోతినగర్లోని సెయింట్ జాన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించారు. ఆర్డీవో కె.మహేశ్వర్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. 415 మంది అభ్యర్థులకు గానూ 391 మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వివరించారు. కాగా భానుడి ప్రతాపానికి అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. దశాబ్దాల తర్వాత రేషన్ డీలర్ల నియామకానికి ప్రకటన వెలువడటంతో పోటాపోటీ నెలకొంది. కాగా, పరీక్ష రాసినవారిలో రాజకీయ పార్టీల నేతల కుటుంబ సభ్యులు, రేషన్ డీలర్ల బంధువులు, రెవెన్యూ ఉద్యోగులు, అధికారుల బంధువులే ఎక్కువగా కనిపించారు. కరీంనగర్ రూరల్, గంగాధర, మానకొండూరు, చొప్పదండి, రామడుగు, తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం, కొత్తపల్లి, కరీంనగర్ అర్బన్ మండలాల్లోని రేషన్ దుకాణాల అభ్యర్థులందరికీ ఇదే స్కూల్ను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు, అధికా రులు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు.
వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లింలకు మేలు
● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిశోర్రెడ్డి
కరీంనగర్టౌన్: వక్ఫ్ నిబంధనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి, పేద, మధ్యతరగతి ముస్లింల ప్రయోజనాలు, సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం వక్ఫ్పై సవరణలు చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్రెడ్డి తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం కరీంనగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ అనేది ఇస్లామిక్ చట్ట ప్రకారం ఇవ్వబడిన, తిరిగి ఇవ్వలేని దాతృత్వ నిధి అన్నారు. 2018 కేంద్రీయ వక్ఫ్ పరిషత్ నివేదిక ప్రకారం మన దేశంలో 10 లక్షల కోట్లకు పైగా అంచనా విలువ కలిగిన ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయన్నారు. అయితే వక్ఫ్ పాలన వ్యవస్థ బలహీనంగా ఉండి, బోర్డులో ఎవరు ఎవరికి జవాబు దారీగా ఉండడం లేదని, దీంతో మోదీ ప్రభుత్వం వక్ఫ్ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి వీలుగా సవరణ చట్టం ప్రవేశపెట్టిందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓవైసీ ముస్లిం సమాజాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నాయకులు యాదగిరి సునీల్రావు, సుంకర మౌనిక, నిర్మలాదేవి, గుగ్గిలపు రమేశ్, కోమల ఆంజనేయులు, కన్నబోయిన ఓదెలు, వాసాల రమేశ్, ప్రవీణ్రావు, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మాడ వెంకటరెడ్డి, సాయిని మల్లేశం, ఎండీ ముజీబ్, సోమిడి వేణుప్రసాద్, చొప్పరి జయశ్రీ, మోహన్రెడ్డి, పుప్పాల రఘు, ఎన్నం ప్రకాష్, బల్బీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కరీంనగర్ –2 డిపోకు అవార్డులు
కరీంనగర్: హైదరాబాద్లోని మారియట్ హోటల్లో ఇటీవల నిర్వహించిన టెక్నికల్ సెమినార్లో కరీంనగర్లో 2 డిపో పలు అవార్డులు అందుకుంది. బీఎస్ 6బస్సులలో హెచ్ఏ కేఎంపీఎల్ సాధించినందుకు, అశోక్ లీలాండ్ ఇంజిన్లో హై మైలేజ్ 20.40లక్షలు కిలోమీటర్లు సాధించినందుకు ఆర్టీసీ సీఎండీ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ మునిశేఖర్, కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్, హైదరాబాద్ గ్రేటర్ జోన్ ఈడీ ఖుస్రో షా ఖాన్, ఈడీ (ఇంజినీరింగ్) వెంకన్న చేతులమీదుగా ఆర్ఎం. బి.రాజు, డిపో మేనేజర్ శ్రీనివాస్, గతంలో డిపో మేనేజర్గా పనిచేసిన వి. మల్లయ్య రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకున్నారు.

రేషన్ డీలర్ల పరీక్ష ప్రశాంతం

రేషన్ డీలర్ల పరీక్ష ప్రశాంతం