● ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి టౌన్ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కను నాటి సంరక్షించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, క్రిటికల్ కేర్ విభాగం ఆవరణలో ఆయన గురువారం ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రి పరిసరాలు పచ్చదనంతో ఉంటే రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వాల్యా, జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ డీఈ హన్మంత్రావు నాయక్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


