● నాలుగేళ్లుగా నరకయాతన పడుతున్న అనాథ
● రోడ్డు ప్రమాదంలో విరిగిన కాలు
● అప్పుడు వేసిన రాడ్ తీయకపోవడంతో ఇబ్బందులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కూలీనాలి చేసుకొని బతికే నర్సింలుకు నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం జరిగి కుడి కాలు విరిగింది. మోకాలి పైభాగంలో రాడ్ వేశారు. అప్పటి నుంచి ఆయన జీవితం తలకిందులైంది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన తెనుగు నర్సింలు రోడ్డు దాటే క్రమంలో వాహనం ఢీకొని కాలు విరిగిపోయింది. స్థానికులు సర్కారు దవాఖానలో చేర్పించగా ఆపరేషన్ చేసిన వైద్యులు రాడ్ వేశారు. తర్వాత రాడ్ను తొలగించాల్సి ఉండింది. మూడు, నాలుగేళ్లుగా సర్కారు దవాఖానకు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. కాగా, ఆయనను చూసుకునేవారెవరూ లేకపోవడం, ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో గ్రామంలో గుళ్ల వద్ద, పాత ఇళ్ల దగ్గరో కాలం వెళ్లదీస్తున్నాడు. ఎవరైనా దయతలచి బుక్కెడు బువ్వ పెడితే తిని పడుకుంటున్నాడు. కాలులో ఉన్న రాడ్ తొలగిస్తే ఏదైనా పని చేసుకొని బతకగలుగుతానన్న ఆత్మవిశ్వాసం ఉంది. అయితే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దేవునిపల్లిలోని బీడీ కాలనీ సమీపంలో నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఓ ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఆపరేషన్ చేయించి తన కష్టాన్ని తీర్చాలని వేడుకుంటున్నాడు.


