ఇక ఎన్‌ఎఫ్‌బీఎస్‌ బాధ్యత ఎంపీడీవోలదే..! | - | Sakshi
Sakshi News home page

ఇక ఎన్‌ఎఫ్‌బీఎస్‌ బాధ్యత ఎంపీడీవోలదే..!

May 17 2026 1:18 AM | Updated on May 17 2026 1:18 AM

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

వేగంగా పథకం అమలు

● నిరుపేద కుటుంబాల(బీపీఎల్‌) ఇంటిని పోషించే 18 నుంచి 59 ఏళ్ల వయస్సు మధ్య గల వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.

● ప్రమాదవశాత్తూ కానీ సహజ మరణం పొందిన వ్యక్తుల కుటుంబాలు ఈ పథకానికి అర్హులు

● మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆదాయం అందిచేవాడుగా ఉండాలి

● ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు

ఎల్లారెడ్డి: నేషనల్‌ ఫ్యామిలీ బెనిఫిట్‌ స్కీం(ఎన్‌ఎఫ్‌బీఎస్‌) నిర్వహణ బాధ్యతలను ఇక నుంచి ఎంపీడీవోలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిరుపేద కుటుంబాలలో ప్రధానంగా సంపాదించే వ్యక్తి చనిపోతే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేస్తుంది. గతంలో ఈ పథకం బాగా ప్రాచుర్యంలో ఉన్నా కొన్ని సంవత్సరాలుగా సరైన ప్రచారం లేక, దరఖాస్తులు పెట్టుకున్న వారికి లబ్ధి అందక మరుగున పడింది. ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఈ పథకానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పథకం బాధ్యత ఇంత వరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఉండేది. ఈ పథకం లబ్ధి కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, వాటి గురించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం, ఆమోదించడం తదితర పనులన్నీ రెవెన్యూ శాఖ కింద ఉండేవి. అయితే పథకం అమలులో గ్రామ పంచాయతీలు, రెవెన్యూ, సంక్షేమ శాఖల మధ్య సమన్వయం లోపించడం కారణంగా లబ్ధిదారులకు సాయం అందడంలో ఆలస్యం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. శాఖల సమన్వయ లోపం కారణంగా ప్రతి తహసీల్‌ కార్యాలయంలో ఎన్‌ఎఫ్‌బీఎస్‌ దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ జాప్యాన్ని నివారించేందుకు దరఖాస్తుల పరిశీలన నుంచి ఆమోదం వరకు మండల స్థాయిలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌ దరఖాస్తులు, కొత్త దరఖాస్తులను ఎంపీడీవోలు పర్యవేక్షించి లబ్ధిదారులకు త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూడాలని ఆదేశించింది.

దరఖాస్తుకు కావాల్సిన ధ్రువపత్రాలు

● ఇంటి పెద్ద(మృతుడు) మరణ ధృవీకరణ పత్రం

● మరణించిన వ్యక్తి ఆధార్‌ కార్డు

● నామినీ ఫొటో, ఆధార్‌ కార్డు

● రేషన్‌ కార్డు లేదా బీపీఎల్‌ కార్డు

● రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం

● ఆమ్‌ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన, ఆపద్భంధు లాంటి పథకాల నుంచి ప్రయోజనం పొందనట్లు ఐకేపీ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం

ఈ ధ్రువపత్రాలన్నీ సమర్పిస్తూ లబ్ధిదారులు స్థానిక గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపీడీవోలు తమకు అందిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శుల ద్వారా వేగంగా పూర్తి చేస్తారు.

అర్హులు వీరే

Advertisement
 
Advertisement
Advertisement