రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని కుప్రియాల్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు శుక్రవారం రాత్రి దుర్మరణం చెందాడు. మండల కేంద్రానికి చెందిన అనంతసేన కృష్ణ(36) ద్విచక్ర వాహనంపై కామారెడ్డి నుంచి స్వగ్రామమైన సదాశివనగర్కు వస్తున్నాడు. అదే సమయంలో కుప్రియాల్ నుంచి వడ్ల లోడ్తో వస్తున్న లారీ కామారెడ్డికి వెళ్లేందుకు యూటర్న్ అవుతుండగా లారీకి తాకడంతో ద్విచక్రవాహనంతో లారీ కిందికి దూసుకెళ్లాడు. దీంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడు ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
పిట్లం(జుక్కల్): బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పిట్లం మండల కేంద్రానికి చెందిన బాలరాజు గౌడ్ (38) శనివారం మృతి చెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం బొల్లక్పల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఈ నెల 14న పిట్లంకు చెందిన బాలరాజు గౌడ్ అపస్మారక స్థితిలో ఉండగా పోలీసులు బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వారం రోజుల్లో 169 డ్రంకెన్డ్రైవ్ కేసులు
నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో 169 డ్రంకెన్డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏడుగురు నిందితులకు కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష, మిగిలిన వారికి రూ.10,80,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.


