● కనీస మద్దతు ధర అందేలా చూడండి
● అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రి యకు సంబంధించి పెండింగ్లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యం సేకరణపై సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. డీసీవో, డీఆర్డీఏ అధికారులు అన్ని కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ధాన్యం విక్రయించిన రైతులకు త్వరగా డబ్బులు అందేలా చూడాలని సూచించారు. కేంద్రాల వద్ద సరిపడా రవాణా వా హనాలను అందుబాటులో ఉంచాలని డిస్ట్రిక్ట్ మేనేజర్లకు సూచించారు. మిల్లుల వద్ద వాహనాలు నిలిచిపోకుండా డీసీఎస్వోలు నిరంతరం పర్యవేక్షిస్తూ మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా అన్ని కేంద్రాలు, మిల్లుల వద్ద తగినన్ని టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని డీఎంవోను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, సివిల్ సప్లై అధికారి వెంకటేష్, డీసీవో రామ్మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, డీఆర్డీఏ సురేందర్, ఆర్టీవో శ్రీనివాస్, డీఎం శ్రీకాంత్ పాల్గొన్నారు.


