బాన్సువాడ: బెస్ట్ అవైలబుల్ స్కీంలో సీట్లు తొలగించవద్దని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈమేరకు వారు శనివారం బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నస్రుల్లాబాద్ మండలంలోగల ఓ ప్రయివేట్ పాఠశాలలో వివిధ తరగతుల్లో బెస్ట్ అవైలబుల్ స్కీంలో భాగంగా 144 మంది ఎస్సీ విద్యార్థులు చదువుతుండగా, ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడంతో వారిని తొలగిస్తామని పాఠశాల యాజమాన్యం చెబుతున్నారన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం చెల్లింపులు చేసి, పునరుద్ధరణ చేయాలని మాల ఎడ్యూకేషనల్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా కార్యదర్శిఽ పాండురంగం డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మెక్క సురేష్, పండరి, పోశెట్టి, అశోక్, విఠల్ తదితరులు ఉన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): హైదరాబాద్–బోధన్ రహదారి విస్తరణ పనులతో ప్రయాణికులకు బస్ షెల్టర్లు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం వేచిచూస్తున్నారు. ఈక్రమంలో మహమ్మద్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యార్థం శనివారం సర్పంచ్ దఫేదార్ బాలమణి పచ్చని పందిరి వేయించారు. పందిరి వేయించి ఎండ కష్టాలను దూరం చేసిన సర్పంచ్కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
బాన్సువాడ రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించరాదని బాన్సువాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెర్రె నర్సింహులు అన్నారు. శనివారం ఆయన బోర్లం క్యాంపులో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. సహకార సంఘం అధికారులు, సిబ్బంది కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీడ, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. నాయకులు గాండ్ల సాయిలు, మన్నె చిన్న సాయిలు, మంగలి ధత్తు, గంగాధర్ తదతరులు ఉన్నారు.
నస్రుల్లాబాద్ : మండలంలోని మైలారం గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైంది. గ్రామానికి చెందిన దార గంగాధర్కు చెందిన గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైరింజన్ చేరుకుని మంటలను ఆర్పివేసినప్పటికీ లాభం లేకుండాపోయింది. రూ.25వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.


