● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎల్లారెడ్డిరూరల్: స్నేహితుడి వివాహానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన దండు నాగరాజు (25) హైదరాబాద్లో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నస్రుల్లాబాద్లో స్నేహితుడి వివాహం ఉండడంతో గురువారం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరాడు. తిమ్మారెడ్డి గ్రామశివారులో ఎల్లారెడ్డి–బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న చెట్టును కారు బలంగా ఢీకొనడంతో ఘటన స్థలంలోనే నాగరాజు మృతి చెందాడు. మృతుడికి ఆరు నెలల క్రితం వివాహమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.


