● ఉరేసుకొని యువతి ఆత్మహత్య
మాక్లూర్: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. కల్లెడికి చెందిన కునాల హన్మాండ్లుకు ఇద్దరు కుమార్తె, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండో కుమార్తె శివాని(31) టీటీసీ పూర్తి చేసింది. గతంలో శివానీకి పెళ్లి సంబంధం కుదిరి ఏర్పాట్లు జరుగుతుండగానే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అప్పటి నుంచి శివానికి పెళ్లి సంబంధాలు రావటం లేదు. వచ్చినా విషయం తెలిసి పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో శివాని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భోజన అనంతరం గదిలోకి వెళ్లిన శివాని గురువారం ఉదయం 10 గంటలు దాటినా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపుతట్టాడు. ఉలుకుపలుకు లేకపోవటంతో గోడ దూకి చూడగా శివాని ఉరేసుకొని మృతి చెందింది. తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.


