ఎన్నికై న వారు వీరే..
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మరోసారి రసవత్తరంగా మారాయి. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేతులు కలిపాయి. చైర్పర్సన్ ఎన్నిక సమయంలో జత కట్టిన రెండు పార్టీలు.. ఇప్పుడూ అదే దోస్తీని కొనసాగించి బీజేపీకి షాక్ ఇచ్చాయి. మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ఎన్వీ గిరి, కమిషనర్ టి పర్వతాలు సమక్షంలో ఎన్నిక ప్రక్రియను గురువారం నిర్వహించారు.
మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా.. కాంగ్రెస్కు 22, బీజేపీకి 16, బీఆర్ఎస్కు 11 మంది సభ్యుల బలం ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో కో ఆప్షన్ పదవులను చేజిక్కించుకోవడానికి సంఖ్యాబలం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లు మరోసారి మిత్రపక్షాలుగా మారాయి. ఎన్నిక ప్రక్రియకు 40వ వార్డు కౌన్సిలర్ సాహెబ్ నాగమణి (కాంగ్రెస్) గైర్హాజరు కాగా.. బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులందరూ హాజరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన 32 మంది సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపడంతో నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. ముందస్తు ఒప్పందం ప్రకారం మూడు పదవులు కాంగ్రెస్కు, ఒక పదవి బీఆర్ఎస్కు దక్కాయి.
బీజేపీకి మళ్లీ నిరాశ
మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునే విషయంలో గతంలోనే భంగపడ్డ బీజేపీకి, ఈ ఎన్నికల్లోనూ నిరాశే ఎదురైంది. కో ఆప్షన్ ఎన్నికలో తమ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులను బరిలో దించింది. కౌన్సిల్లో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలయికతో బీజేపీ అభ్యర్థులకు అవకాశం లేకుండా పోయింది.
ముందే చెప్పిన ‘సాక్షి’
కో ఆప్షన్ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ జతకడతాయని, కాంగ్రెస్కు మూడు, బీఆర్ఎస్కు ఒక పదవి ఇచ్చుకునేలా ఒప్పందం కుదిరిందని ‘సాక్షి’ ముందే అభ్యర్థుల పేర్లతో సహా ప్రచురించింది. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ‘సాక్షి’ ముందే ఊహించి చెప్పినట్లుగానే అభ్యర్థుల ఎన్నిక జరగడం గమనార్హం. వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రమాణస్వీకారం చేస్తున్న కుంబాల రవియాదవ్, గోనె సునీత, అలీ బిన్ అబ్దుల్లా, ఆస్మా అదిబా ఖానం
కో ఆప్షన్ పదవుల కోసం మొత్తం 33 మంది పోటీలో ఉండగా, ఎన్నికల సమయంలో 9 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి జనరల్ విభాగంలో గోనె సునీత, మైనారిటీ విభాగంలో అస్మా అదిబా ఖనాం, అలీ బిన్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ నుంచి జనరల్ విభాగంలో కుంబాల రవి పదవిని దక్కించుకున్నారు. ఎన్నికై న సభ్యులకు అదనపు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం అధికారులు, సభ్యుల సమక్షంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. గెలుపొందిన వారిని చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు సన్మానించారు.
కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో కాంగ్రెస్,
బీఆర్ఎస్ పరస్పర మద్దతు
మూడు పదవులు కాంగ్రెస్కు..
ఒకటి బీఆర్ఎస్కు
కమలం పార్టీకి మరోసారి భంగపాటు


