నస్రుల్లాబాద్ : రైస్మిల్ యజమానులు తరుగు పేరిట మోసం చేస్తున్నారని మైలారం గ్రామ రైతులు సోమవారం మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి లారీల్లో మిల్లుకు తరలించిన తర్వాత తరుగు తీసి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత సివిల్ సప్లయి డీటీతో ఫోన్లో మాట్లాడితే తనకేం సంబంధం లేదని సమాధానం చెబుతూ, రైస్మిల్లు యజమానులకు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. సుమారు గంట పాటు రోడ్డుపై కూర్చొని జిల్లా అధికారులు తమ గోడుపట్టించుకోవాలని వేడుకున్నారు. ఘటన స్థలానికి తహసీల్దార్ సువర్ణ చేరుకొని రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


