బీబీపేట: నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలకు నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాలు.. ఆముదాల కిష్టయ్య (73) ఇంట్లోని కొత్త గోడకు మోటార్తో నీళ్లు పట్టి అదే చేతితో ప్లగ్ తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే కిష్టయ్య మృతి చెందాడు. భార్య ఆముదాల భారతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎర్రకుంట తండాకు చెందిన మలావత్ పత్యా(48) ఆదివారం నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పత్యా గత నెల 23న ఆత్మకూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమా దంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 10 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన పత్యా ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు.


