నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్నగర్ మండలం సింగితం గ్రామంలో వరిధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. వరి పంట నూర్పిడి చేసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఆ కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పలు పోసి, విక్రయాల కోసం సిద్ధం చేశారు. అయితే సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినా ధాన్యం తూకాలకు నోచుకోవడం లేదు. హమాలీల కొరత నెలకొంది. బిహారీ హమాలీల కోసం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా తూకాలపై శ్రద్ధ చూపడం లేదు. మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ధాన్యం తూకాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తూకాలు ప్రారంభమయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.


