
‘పిల్లల భద్రత కోసం కృషి చేయాలి’
కామారెడ్డి క్రైం: చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా ఎంపికై న ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో పిల్లల భద్రత కోసం కృషి చేయాలని, లైంగిక దాడులు జరగకుండా చూడాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ప్రతి పాఠశాలకు ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ను నియమించామన్నారు. పిల్లలపై ఎలాంటి లైంగిక దాడులు జరగకుండా చూడాలన్నారు. అవసరమైతే తప్పు చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.