సఖినేటిపల్లి: స్థానికంగా ఖననం చేసిన ఓ వ్యక్తి మృతదేహాన్ని రాజోలు కోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు తిరిగి గురువారం వెలికి తీసి, శవపరీక్షలు నిర్వహించారు. రాజోలు సీఐ సురేష్బాబు, తహసీల్దార్ బి.సూర్యనారాయణరాజు, వైద్యులు, మధ్యవర్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు కథనం ప్రకారం.. సఖినేటిపల్లికి చెందిన గొల్లమందల కిరణ్ కుమార్ అలియాస్ కన్నులు తండ్రి పీటర్ (40) మార్చి 6న విషం తాగాడు. మలికిపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం, 13వ తేదీన డిశ్చార్జ్ అయ్యాడు. ఈ క్రమంలో మార్చి 15న తీవ్ర అనారోగ్యానికి గురైన పీటర్ను కుటుంబ సభ్యులు అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పీటర్ చనిపోయినట్లు అక్కడి డ్యూటీ డాక్టర్ ధ్రువీకరించారు. దీంతో, మార్చి 16న అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. ఇదిలా ఉండగా మహేంద్రవాడకు చెందిన మృతుడి సోదరి నిస్సి రాజశ్రీ తన సోదరుడి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ రాజోలు కోర్టులో ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు తొమ్మిది మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో, కోర్టు ఉత్తర్వుల మేరకు వారిపై కేసు నమోదు చేశామని, పీటర్ మృతదేహానికి తిరిగి పరీక్షలు చేశామని ఎస్సై వివరించారు.


