చేపా చేపా.. ఎందుకు పడలేదు? | - | Sakshi
Sakshi News home page

చేపా చేపా.. ఎందుకు పడలేదు?

Jun 17 2025 5:22 AM | Updated on Jun 17 2025 5:22 AM

చేపా

చేపా చేపా.. ఎందుకు పడలేదు?

వేట నిషేధం తరువాత చిక్కని చేపలు

నిరాశతో వెనుదిరుగుతున్న మత్స్యకారులు

ఒడ్డుకు చేరిన సుమారు 200 బోట్లు

నిలిచిపోయిన వ్యాపారం

బోసిపోయిన ఉప్పాడ సాగరతీరం

పిఠాపురం: రెండు నెలల విరామం అనంతరం ఎంతో ఆశతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. ఎంత వెతికినా, ఎన్నిసార్లు వల వేసినా ఒక్క చేపా చిక్కకపోవడంతో మత్స్యకారులు వట్టి చేతులతో వెనుదిరుగుతున్నారు. చేపల వేట నిషేధం ఎత్తివేత అనంతరం కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సముద్రంపై చేపల వేటకు వెళ్లిన బోట్లు ఖాళీగా ఒడ్డుకు చేరుకుంటున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లిన మత్స్యకారులు సైతం చేపలు పడక ఖాళీ బోట్లతో తిరిగి వచ్చేస్తున్నారు. దీంతో, వేటకు వెళ్లాల్సిన బోట్లు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. చేపల క్రయవిక్రయాలతో కళకళలాడాల్సిన ఉప్పాడ తీర ప్రాంతం ఖాళీగా దర్శనమిస్తోంది.

రూ.2 కోట్ల మేర నష్టం

మత్స్యసంతతి వృద్ధి చెందేందుకు వీలుగా బంగాళాఖాతంలో చేపల వేటపై కేంద్ర ప్రభుత్వం రెండు నెలల పాటు విధించిన నిషేధం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. అయితే, ఈ నెల 10వ తేదీ నుంచే చాలా మంది మత్స్యకారులు చేపల వేటకు బయలుదేరారు. ఇది ఏటా సాధారణంగా జరిగేదే. దీనికి అధికారులు కూడా అడ్డు చెప్పరు. సముద్రంలో సుదూర ప్రాంతాలకు బోట్లలో 8 నుంచి 12 మంది వరకూ మత్స్యకారులు వేటకు వెళ్తూంటారు. సుమారు రూ.50 వేల విలువైన డీజిల్‌, రూ.30 వేల ఐస్‌, ఇతర వంట సామగ్రితో వారు బయలుదేరుతారు. సుమారు 8 నుంచి 10 రోజుల పాటు వేట సాగించి మత్స్య సంపదతో తిరిగి వస్తూంటారు. ఇలా వేటకు వెళ్లిన వారు కూలితో కలిపి ఒక్కో బోటుకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.40 లక్షల వరకూ పెట్టుబడి పెడుతూంటారు. సముద్రంలో 100 నుంచి 200 నాటికల్‌ మైళ్ల దూరానికి వెళ్లి, సొర వంటి పెద్ద చేపలను వేటాడుతూంటారు. కానీ, ఈసారి అలా వెళ్లిన మత్స్యకారులు చేపలు లేకుండానే ఒడ్డుకు చేరుకుంటున్నారు. సుమారు 200 బోట్లు చేపలు లేకుండానే ఖాళీగా వెనుదిరగడంతో రూ.2 కోట్లు పైగా నష్టం వచ్చిందని మత్స్యకారులు వాపోతున్నారు.

ప్చ్‌.. వ్యాపారం లే..

వేటకు బోట్లలో వెళ్లిన మత్స్యకారులు వట్టి చేతులతో తిరిగి వస్తూండడంతో తీరాన ఉన్న మత్స్యకారులు తమ బోట్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో, చేపల క్రయవిక్రయాలతో కళకళలాడాల్సిన ఉప్పాడ తీరం బోసిపోయింది. జిల్లాలో కాకినాడ హార్బర్‌ తరువాత యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సాగర తీరంలోనే చేపల ఎగుమతులు ఎక్కువగా జరుగుతూంటాయి. వేట నిషేధం అనంతరం తొలి రోజు నుంచే చేపల క్రయవిక్రయాలతో ఉప్పాడ కళకళలాడుతూంటుంది. ఇక్కడి నుంచి ప్రతి రోజూ 100 నుంచి 150 లారీల్లో వివిధ రకాల చేపలు 2 వేల టన్నుల వరకూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతూంటాయి. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ఉప్పాడ చేరుకున్న పలు లారీలు చేపలు లేకపోవడంతో ఇక్కడే నిలిచిపోయాయి. రూ.కోట్లలో జరిగే వ్యాపార లావాదేవీలు సైతం స్తంభించిపోయాయి. చేపలను నిల్వ ఉంచేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉంచిన టన్నులకొద్దీ ఐస్‌ కరిగిపోతోంది.

ఇలా జరగడం ఇదే తొలిసారి

సాధారణంగా రెండు నెలల నిషేధం తరువాత వేటకు వెళ్తే భారీగా మత్స్య సంపద దొరుకుతూంటుంది. అందుకోసమే నిషేధం పూర్తయిన వెంటనే వేటకు వెళ్లేందుకు ఎక్కువ మంది ముహూర్తాలు చూసుకుని ముందు నుంచీ సిద్ధమవుతూంటాం. ఈ ఏడాది ఏం జరిగిందో ఏమో కానీ ఏ ఒక్క బోటుకూ చేపలు పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. సుమారు రూ.1.20 లక్షల పెట్టుబడితో వేటకు వెళ్తే కనీసం రూ.20 వేల ఖరీదైన చేపలు కూడా పడలేదు. అవి కూడా చిన్న సైజు చేపలు మాత్రమే దొరికాయి. చాలా నష్టం వచ్చింది. నిషేధం తరువాత గతంలో ఎప్పుడూ ఇలా వట్టి చేతులతో తిరిగి వచ్చిన సందర్భాలు లేవు. మాతోపాటు వేటకు వచ్చిన అన్ని బోట్ల వారూ చేపలు పడకపోవడం ఇదే మొదటిసారని అంటున్నారు.

– పట్టా సూరిబాబు, మత్స్యకారుడు, కొత్తపట్నం, ఉప్పాడ శివారు

చేపలు పడటం లేదు

తుపాను వచ్చినప్పుడు సముద్రం అల్లకల్లోలంగా ఉండి కొన్ని రోజులు చేపలు దొరకని పరిస్థితి ఉంటుంది. కానీ, సముద్రం బాగానే ఉంది. కానీ, ఎక్కడకు వెళ్లినా చేపలు పడటం లేదు. కోనాలు, సూరలు, సొరల వంటి చేపల వేటకు వెళ్లిన వారితో పాటు తీరం వెంబడి వేటకు వచ్చిన వారికి కూడా చేపలు అంతగా పడలేదు. ఐదు రోజులైనా ఏ ఒక్కరికీ కనీసం రూ.10 వేల విలువైన చేపలు కూడా పడినట్లు లేదు. అందరం నిరాశతో వెనక్కి వచ్చేశాం. అందరికీ రూ.లక్షల్లో నష్టం వచ్చింది. మామూలు సమయాల్లో ఒక్కోసారి కొందరికి వేట పడదు. కానీ నిషేధం తరువాత ఎక్కువ చేపలు దొరుకుతాయి. కానీ, ఈసారి ఏ ఒక్కరికీ చేపలు పడలేదు.

– వనమాడి ఎల్లారావు, మత్స్యకారుడు, కొత్తపట్నం, ఉప్పాడ శివారు

వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు

చేపలు పడటం లేదని మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం, సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వాతావరణ మార్పుల వల్ల కూడా చేపలు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సముద్రంలో కలుషిత జలాలు ఎక్కువగా కలవడం వల్ల కూడా ఆయా ప్రాంతాల్లో చేపలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉప్పాడ, కాకినాడ తీరాల నుంచి వెళ్లిన బోట్లు చేపలు పడకపోవడంతో ఒడ్డుకు వచ్చేశాయి. వేటకు వెళ్లాల్సిన బోట్లు వెళ్లలేదు.

– శివరామకృష్ణ,

మత్స్యశాఖాధికారి, ఉప్పాడ

చేపా చేపా.. ఎందుకు పడలేదు?1
1/2

చేపా చేపా.. ఎందుకు పడలేదు?

చేపా చేపా.. ఎందుకు పడలేదు?2
2/2

చేపా చేపా.. ఎందుకు పడలేదు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement