
పాఠశాలల్లో సౌకర్యాలపై సమీక్ష
కాకినాడ సిటీ: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ, జిల్లా పరిషత్, డ్వామా, పంచాయతీరాజ్, పాడా శాఖల అధికారులతో కలిసి పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, తాగునీరు, కాంపౌండ్ వాల్ నిర్వహణ, ఫెన్సింగ్ ఏర్పాటు, క్రీడామైదానాల నిర్వహణ, యోగాంధ్ర తదితర అంశాలపై చర్యలు చేపట్టాలన్నారు. అన్ని తరగతి గదులలో విద్యుత్తు సదుపాయం అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో తాగునీరుకు ఉపయోగించే ట్యాంకులను శుభ్రం చేయించాలని ఆదేశించారు. మరుగుదొడ్లలో నీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో నూట్రిన్ గార్డెన్కు రక్షణ కల్పించే విధంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలన్నారు. అన్నిచోట్ల కాంపౌండ్ వాల్ ఉండేలా చూడాలన్నారు. ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, మరమ్మతుల నిమిత్తం పాఠశాల గదుల్లో వేసి మెటరియల్స్ను వెంటనే తొలగించి శుభ్రం చేయించాలని, పాఠశాల క్రీడా మైదానాలను విద్యార్థులు వినియోగించుకునేందుకు అనువుగా శుభ్రం చేయించాలని ఆదేశించారు. డీఆర్వో జె.వెంకటరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, పాడా పీడీ చైత్రవర్షిణి, డీపీవో రవికుమార్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
అర్జీదారు సంతృప్తి ముఖ్యం
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీకి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారంపై శాఖల వారీగా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 31,641 దరఖాస్తులు రాగా అందులో 28,993 పరిష్కరించామన్నారు. వచ్చే రెండు రోజుల్లో సమావేశాలు నిర్వహించి సిబ్బందికి పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీసుకోవలసిన పద్ధతులపై వివరించాలని కలెక్టర్ సూచించారు. రీ ఓపెన్ అయ్యే దరఖాస్తుల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డీఆర్వో జె.వెంకటరావు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వాసుదేవరావు పాల్గొన్నారు.