
ఉపాధ్యాయ బదిలీలు పూర్తి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలు, ఎస్జీటీలకు సంబంధించి 6,572 మంది బదిలీ అయ్యారన్నారు. జెడ్పీ పరిధిలో స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా 96 మంది, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో 10 మంది పదోన్నతి పొందారని తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలో సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 204 మందికి పదోన్నతి కల్పించామని రమేష్ తెలిపారు.
పీజీఆర్ఎస్కు 681 అర్జీలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 681 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్ అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులో పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్లైన్ తదితర సమస్యలపై అర్జీలు అందాయని కలెక్టర్ వివరించారు.
కేతన్ గార్గ్ బదిలీ
రాజమహేంద్రవరం సిటీ: నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేతన్ గార్గ్ దాదాపు ఏడాది కాలం నుంచి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా పని చేస్తున్నారు. ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో ఇంకా ఎవ్వరినీ నియమించలేదు. కొత్త కమిషనర్ వచ్చేంత వరకూ జిల్లా కలెక్టర్ ప్రశాంతికి కమిషనర్గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు.
అమలాపురంలో
విపత్తుల స్పందన దళం స్థావరం
అమలాపురం టౌన్: జిల్లాలో తరచుగా సంభవించే తుపాన్లు, గోదావరి వరదలు, చమురు సంస్థల గ్యాస్ లీకేజీ వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే ఆదుకుని ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విపత్తుల స్పందన దళం స్థావరాన్ని అమలాపురంలో నెలకొల్పుతున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వెనుక గల పాత సబ్ జైలు భవనంలో ఈ స్థావరం నెలకొల్పాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ జైలు భవనాన్ని కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ స్థావరంలో దళం నివాసం ఉండి రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణకు సంసిద్ధమై ఉంటుందన్నారు. తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్తోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ బదిలీలు పూర్తి