మెట్టలో మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

మెట్టలో మట్టి మాఫియా

Jun 17 2025 5:22 AM | Updated on Jun 17 2025 5:22 AM

మెట్ట

మెట్టలో మట్టి మాఫియా

కె.గోపాలపురంలో భారీగా తవ్వకాలు

రోజూ 50 టిప్పర్లతో రవాణా

ఛిద్రమవుతున్న రహదారులు

గండేపల్లి: మెట్టలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పెద్దపెద్ద లారీలతో మట్టి తరలించుకుపోతూ అక్రమార్కులు రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. మెట్ట, చెరువు.. ఇలా ఎక్కడ అవకాశముంటే అక్కడ గెద్దల్లా వాలిపోతూ.. నేలతల్లికి తూట్లు పొడుస్తున్నారు. గండేపల్లి మండలం కె.గోపాలపురంలో కొద్ది రోజులుగా మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. నర్సరీల్లో ఎర్రమట్టికి అధిక గిరాకీ ఉండటంతో అక్రమార్కుల కన్ను ఈ ప్రాంతంలోని ఎర్రమట్టిపై పడింది. గ్రామ శివారున సర్వే నంబర్‌ 1/1లో కొద్ది రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా భారీ టిప్పర్లలో మట్టి తరలించుకుపోగా.. ఇప్పుడు సర్వే నంబర్‌ 209లో ఎర్రమట్టి విచ్చలవిడిగా తవ్వేసి, తరలించుకుపోతున్నారు. మట్టి తవ్వకాలు పొక్లెయిన్‌ సైతం వినియోగిస్తున్నారు. తవ్విన మట్టిని తరలించేందుకు కొండలను సైతం పిండి చేసి, దర్జాగా బాటలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో టిప్పర్‌ మట్టికి సుమారు రూ.10 వేల నుంచి దూరాన్ని బట్టి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజూ సుమారు 50 టిప్పర్లతో మట్టి తరలించుకుపోతున్నారు. కళ్ల ముందే ఈ దందా జరుగుతునప్పటికీ ఇటు రెవెన్యూ, అటు అటవీ అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ మొత్తాలు చేతులు మారుతున్నందువల్లనే చూసీచూడనట్లు వదిస్తేన్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి కోసం కొంత మంది రైతులకు డబ్బు ఆశ చూపి, పంట భూములను సైతం గుల్ల చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో, తమ పొలాలు కూడా పాడవుతున్నాయని చుట్టుపక్కల రైతులు వాపోతున్నారు. గతంలో డి–పట్టా భూముల రైతుల అవసరాలను సైతం అనుకూలంగా మార్చుకుని, అక్కడి కొండను తవ్వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హడలెత్తుతున్న గ్రామస్తులు

కె.గోపాలపురం నుంచి మట్టి టిప్పర్లు ఎన్‌టీ రాజాపురం మీదుగా జాతీయ రహదారికి చేరుకుంటున్నాయి. ఆ టిప్పర్లను డ్రైవర్లు మితిమీరిన వేగంతో రేయింబవళ్లు నడుపుతూండటంతో ఆ గ్రామస్తులు హడలెత్తుతున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక లోడుతో మట్టి టిప్పర్లను నడుపుతూండటంతో ఆ మార్గంలో నేల అదిరిపోతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో, తమ ఇళ్లు, గోడలు బీటలు తీసి, కుంగిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధిక లోడు వల్ల రోడ్లు ఛిద్రమవుతున్నాయి. మట్టి తవ్వకాలకు మైనింగ్‌ అధికారులే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, తాము ఎటువంటి అనుమతీ ఇవ్వలేదని, అక్రమ తవ్వకాలపై చర్యలు చేపడతామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మట్టి మాఫియాకు వెంటనే కళ్లెం వేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.

మెట్టలో మట్టి మాఫియా1
1/1

మెట్టలో మట్టి మాఫియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement