
ప్రభుత్వ ఉద్యోగి జీతమైనా ఇవ్వండి
●
● సంక్షేమ పథకాలైనా అమలు చేయండి
● కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంగన్వాడీల కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో వేతనాలైనా ఇవ్వాలని, లేదంటే సంక్షేమ పథకాలయినా అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జి.బేబీరాణి, దడాల పద్మ మాట్లాడుతూ, చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు కూటమి పెద్దలు మ్యానిఫెస్టోలో పేర్కొన్నారని, నేడు అధికారంలోకి రాగానే అంగన్వాడీలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధికార సర్వేలో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసి, తప్పు చేశారని, ఇప్పటికే పని గంటలు పెంచి విపరీతమైన పని ఒత్తిడి పెంచారని చెప్పారు. ఆయాకు రూ.7 వేలు, టీచరుకు రూ.11,500 చెల్లిస్తూ ప్రభుత్వోద్యోగులుగా చెప్పడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గనిపించడలేదా అని ప్రశ్నించారు. అంగన్వాడీ కుటుంబాల్లోని పిల్లలకు తల్లికి వందనం డబ్బులు వేయకపోవడమే కాకుండా వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు ఆపేశారని, వితంతు పింఛన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తున్న వేతనంతో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు వండి పెట్టేందుకు, సెంటర్ అద్దెలకు పెట్టుబడి పెడుతూ, కార్యకర్తల కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా రమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకట రమణ, పలివెల వీరబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.