‘సాక్షి’ తోడుగా.. దేవస్థానానికి ఆదా | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ తోడుగా.. దేవస్థానానికి ఆదా

Apr 8 2025 7:15 AM | Updated on Apr 8 2025 7:15 AM

‘సాక్

‘సాక్షి’ తోడుగా.. దేవస్థానానికి ఆదా

రత్నగిరిపై నెలకు రూ.23,990కే

‘చెత్త’ ట్రాక్టర్‌ కాంట్రాక్ట్‌ ఖరారు

గతంలో టెండర్‌ లేకుండానే

రూ.60 వేలకు అప్పగింత

దీనిపై ‘సాక్షి’ కథనం

స్పందించి టెండర్‌ పిలిచిన అధికారులు

తాజాగా మరింత తక్కువకు కొటేషన్‌

దేవస్థానానికి నెలకు రూ.36,010 మిగులు

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ట్రాక్టర్‌తో చెత్త తరలించేందుకు గాను నెలకు రూ.23,990కు టెండర్‌ ఖరారైంది. దీనికి సంబంధించిన వివరాలివీ.. రత్నగిరిపై సత్యదేవుని వ్రతాల్లో ఉపయోగించిన పత్రి, పువ్వులు, తమలపాకులతో పాటు ఆలయ ప్రాంగణంలో చెత్తను తరలించే పనిని గతంలో శానిటరీ కాంట్రాక్టర్‌ నిర్వహించేవారు. గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఈ కాంట్రాక్ట్‌ నిర్వహించిన కేఎల్‌టీఎస్‌ సంస్థ మార్చి 1 నుంచి వైదొలగింది. దీంతో, దేవస్థానంలో చెత్త తరలింపునకు ఒక ట్రాక్టర్‌, రెండు ట్రక్కులు, ట్రాక్టర్‌కు అవసరమయ్యే డీజిల్‌, ఇతర నిర్వహణ ఖర్చులు భరించేలా నెలకు రూ.60 వేలకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. టీడీపీలోని ఒక ద్వితీయ శ్రేణి నాయకుడి సిఫారసుతో ఆ పార్టీ కార్యకర్తకు ఏకపక్షంగా ఈ పనిని అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో చెత్త ట్రాక్టర్‌ నిర్వహించిన యడ్ల కృష్ణ అనే వ్యక్తి తాను నెలకు రూ.43 వేలకే చెత్త తరలిస్తానని లిఖితపూర్వకంగా తెలియజేసినా దేవస్థానం అధికారులు స్పందించలేదు. ఈ వ్యవహారంపై ‘రత్నగిరిపై చెత్త వివాదం’ శీర్షికన మార్చి 28న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో విధి లేని పరిస్థితిలో స్పందించిన అధికారులు చెత్త తరలింపునకు టెండర్‌ పిలిచారు. ఈ టెండర్లను సోమవారం తెరవగా నాలుగు కొటేషన్లు వచ్చాయి. వీటిలో అతి తక్కువగా నెలకు రూ.23,990కే దాఖలైన టెండర్‌ను ఖరారు చేశారు. ‘సాక్షి’ కథనం కారణంగా దేవస్థానానికి నెలకు రూ.36,010, సంవత్సరానికి రూ.4,32,120 మేర ఆదా అయ్యింది.

శానిటేషన్‌ టెండర్‌ పిలిస్తే రూ.లక్షల్లో ఆదా

చెత్త ట్రాక్టర్‌ టెండర్‌లోనే దేవస్థానానికి నెలకు రూ.36,010 ఆదా కాగా, ఇక శానిటేషన్‌ టెండర్‌ కూడా పిలిస్తే రూ.లక్షల్లో ఆదా అయ్యే అవకాశం ఉంది. దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు ఎటువంటి టెండర్‌ పిలవకుండానే నామినేషన్‌ పద్ధతిలో గుంటూరుకు చెందిన కనకదుర్గ సర్వీసెస్‌ సంస్థకు 349 మంది పని వారిని సమకూర్చే పనిని అప్పగించారు. వాస్తవానికి దీనిని కూడా టెండర్‌ ద్వారానే చేయాల్సి ఉంది. ప్రస్తుతం దేవస్థానం అధికారులు శానిటరీ మెటీరియల్‌ సూపర్‌బజార్‌లో కొనుగోలు చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణకు సుమారు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీనికి ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా భవిష్యత్తులో ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శానిటేషన్‌ కాంట్రాక్టుకు కూడా టెండర్‌ పిలిస్తే దేవస్థానానికి నెలకు రూ.10 లక్షల వరకూ మిగిలే అవకాశం ఉంది. దీనిపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.

‘సాక్షి’ తోడుగా..  దేవస్థానానికి ఆదా1
1/1

‘సాక్షి’ తోడుగా.. దేవస్థానానికి ఆదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement