
రత్నగిరిపై భక్తుల సందడి
ఫ సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
ఫ 1,600 వ్రతాల నిర్వహణ
ఫ రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని ఆదివారం 40 వేల మంది దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,600 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, టేకు రథంపై వేంచేయించారు. పూజల అనంతరం పండితులు రథ సేవ ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు సేవ అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు ధరించి (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమివ్వనున్నారు.