● యువతి హత్యతో ఉలిక్కిపడిన జడ్చర్ల
● అపస్మారక స్థితిలో ప్రేమోన్మాది
జడ్చర్ల: జడ్చర్లలో నడిరోడ్డుపై ఓ ఉన్మాది.. యువతిని దారుణహత్య చేసిన సంఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటనతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరు.. ఎక్కడా.. అంటూ జనం ఆరా తీశారు. బాదేపల్లిలోని నిమ్మబాయిగడ్డ నుంచి ఎర్రసత్యం కాలనీలో ఉంటున్న తన ఇంటికి వెళుతున్న యువతి వైష్ణవి(23)ను గుట్టుగా వెంటాడుతు వచ్చిన ఓ యువకుడు(30) కత్తితో విచక్షణ రహితంగా దాడి చయడంతో.. సీసీ రోడ్డుపై ఆ యువతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రక్తం మడుగులో విలవిలలాడుతూ ప్రాణాలు వదలింది.రక్తం మరకలతో పారిపోతున్న యువకుడిని స్థానికులు వెంటాడి పట్టుకొని తాళ్లతో చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. కొందరు రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీసులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
● వైష్ణవి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో నిందితుడితో పరిచయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి వారితో సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా యువతి దారుణహత్యను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. కాగా.. వైష్ణవి హత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, తదితరులు బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.


