అలంపూర్/గట్టు/అయిజ: జిల్లాలోని అలంపూర్, అయిజ, గట్టు తదితర మండలాల్లో శనివారం కురిసిన అకాల వర్షానికి వరి, మొక్కజొన్న ధాన్యం తడిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్యార్డులలో మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. టార్ఫాలిన్లు కప్పినా ధాన్యంలోకి నీరు చేరాయి. భారీ వర్షం కురిస్తే రైతులకు నష్టం వాటిల్లేదని పలువురు ఆందోళన చెందారు. మొక్కజొన్న బస్తాలను త్వరగా గోదాంలకు తరలించాలని కోరారు. అదే విధంగా గట్టు మండలంలోని ఆరగిద్ద, తప్పెట్లమొర్సు, గొర్లఖాన్దొడ్డి, మాచర్ల, బల్గెర గ్రామాల్లో అకాల వర్షానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యం తడిసిపోకుండా కాపాడుకున్నారు. కాగా, వేసవి తాపంతో సతమతమవుతున్న వారికి వర్షం కాస్త ఊరటనిచ్చింది.


