అభ్యసనా సామర్థ్యాల పెంపే లక్ష్యం
ఎర్రవల్లి: ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ జగదీశ్వర్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను సందర్శించారు. ముందుగా కొండపేట, ఎర్రవల్లి బెటాలియన్, ప్రాథమిక పాఠశాలలు, సరస్వతి, సాయుధ చైతన్య ప్రైవేట్ పాఠశాలలను సందర్శించి పునాది అభ్యాసన అధ్యయనం కార్యక్రమాల అమలును పరిశీలించారు. ముఖ్యంగా 3వ తరగతి విద్యార్థుల ఎఫ్ఎల్ఎస్ సన్నద్ధత, మాక్ టెస్టుల నిర్వహణ, ఐటెం బ్యాంక్ సాధన, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే వివిధ మాధ్యమాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎఫ్ఎల్ఎస్కు పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలన్నారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా నమూనా పరీక్షలు నిర్వహించాలని, దీనికి అవసరమైన అన్ని రికార్డులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర బృందాల సందర్శన అనంతరం పాఠశాలల్లో రూపొందించిన నివేదికలను ఈ నెల 13లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంఓ మైఖేల్, జిల్లా సూపరింటెండెంట్ వీరశేఖర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఖాజా, సీఆర్పీ రాణి, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


