పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ
గద్వాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కీలకమైనదని, ఇందులో ఎలాంటి తప్పిదాలకు చోటులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కౌంటింగ్ ప్రక్రియపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కౌంటింగ్ నిర్వహించే సిబ్బంది, అధికారులు సకాలంలో కేంద్రాలకు చేరుకొని ఉదయం 8 గంటలకే ప్రక్రియ మొదలుపెట్టాలన్నారు. మూడు వార్డులకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారి లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించాక సాధారణ బ్యాలెట్ పేపర్లు లెక్కించాలన్నారు. ఒక్కో వార్డులో రెండు నుంచి మూడు పోలింగ్ స్టేషన్ల వారిగా బ్యాలెట్ బాక్సులు ఉంటాయన్నారు. చెల్లుబాటు, చెల్లుబాటు కాని బ్యాలెట్ పేపర్స్ విషయంలో సంబంధిత వార్డు రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం అన్నారు. తుదిఫలితం ప్రకటించే ముందే ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అనదపు కలెక్టర్ నర్సింగ్రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
ర్యాండమైజేషన్ పూర్తి
మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది కేటాయింపు కోసం మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. ఎన్నికల పరిశీలకులు చంద్రశేఖర్రెడ్డితో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 189 పోలింగ్ కేంద్రాలకు 189 మంది పీఓలు, 189 మంది ఏపీఓలు, 567 మంది ఓపీఓలను కేటాయించినట్లు వివరించారు.


