‘ఓటుతోనే ప్రజాస్వామ్యం పరిరక్షణ’
గద్వాలటౌన్: రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే ప్రజాస్వామ్యానికి పరిపుష్టత చేకూర్చినట్లు అవుతుందని అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషినల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరుగా నమోదు కాని వారు వ్యవస్థను మార్చలేరన్నారు. యువకుల చేతిలో ఓటు ఓ ఆయుదం లాంటిదని, మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్కు భరోసా దొరుకుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను అందరూ గుర్తించుకొని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని నమోదు చేయాలన్నారు. ఓటు హక్కు నమోదు, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి రమేష్బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్బాషా, డీవైఎస్ఓ కృష్ణయ్య, తహసీల్దార్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ర్యాలీ...
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు జెండా ఊపి స్థానిక కలెక్టరేట్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ నినాదాలు చేశారు. అడిషనల్ కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ర్యాలీలో పాల్గొన్ని స్ఫూర్తిని చాటారు.
‘ఓటుతోనే ప్రజాస్వామ్యం పరిరక్షణ’


