ప్రతి పల్లెకు బ్యాంకు సేవలు
ఎర్రవల్లి: గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చేందుకే ఎస్బీఐ కీలక అడుగులు వేసి నూతన శాఖను ప్రారంభించిందని ఎంపీ మల్లు రవి అన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన ఎస్బీఐ నూతన శాఖను ఎమ్మెల్యే విజయుడు, జీఎం సతీష్కుమార్తో కలిసి ఎంపీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లెకు ఎస్బీఐ సేవలను అందించడమే లక్ష్యంగా ఎర్రవల్లి కూడలిలో బ్యాంకు నూతన శాఖను ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఎస్బీఐలో ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు, రైతులు, మహిళలు, చిరు వ్యాపారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బ్యాంకులంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన బ్యాంకు సేవలను అందించి ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం..
స్థానిక ఎమ్మెల్యే విజయుడుతో తమకు ఎలాంటి విబేధాలు లేవని, ఇద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారమని, ఆయనతో కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎంపీ మల్లురవి అన్నారు. పార్టీలు వేరైనా అభివృద్ధే ఎజెండాగా కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ సంఘటన వివాదాస్పదం కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో గద్వాల ఆర్డీఓ అలివేలు, ఎస్బీఐ ఏజీఎం బిరోజ్ కుమార్, ఆర్ఎం సుజాత, బ్రాంచి మేనేజర్ శివతేజ, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెప్ప, తహసీల్దార్ నరేష్, సర్పంచ్ అనిత తదితరులు పాల్గొన్నారు.


