ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి ఉండాలి
గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి పురోగతి సాధించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎంపీడీఓలతో మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రస్తుతం జిల్లా రాష్ట్రస్థాయిలో 19వ స్థానంలో ఉందన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 75కోట్లు లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు చెప్పారు. మంజూరు పొందిన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణ పనులు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. 45 రోజులలోపు మార్క్ అవుట్ చేయని లబ్ధిదారులను రద్దుచేసి.. వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించి, ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అలంపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరింత ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో గృహనిర్మాణశాఖ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, డీపీఓ శ్రీకాంత్ ఉన్నారు.
నిబంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి
ప్రభుత్వ నిబంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గద్వాల మున్సిపాలిటీలోని వెంకటపేట శివారు సర్వేనం. 20లో లేఅవుట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యాప్లను చూసి.. రోడ్డు కనెక్టివిటి, నీటి వనరులు, బఫర్ జోన్ తదితర అంశాలపై ఆరా తీశారు. లేఅవుట్ల అభివృద్ధిలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. దీంతో పాటు సర్వే.నం 494 లేఅవుట్ను కలెక్టర్ పరిశీంచారు. ఇక్కడ నీటి కనెక్షన్, స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేనం. అదే విధంగా సర్వేనం.1028లోని లేఅవుట్లో నీటి వనరులు, విద్యుత్, డ్రెయినేజీలను అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జానకీరామ్, టౌన్ ప్లానింగ్ అధికారి కుర్మన్న, తహసీల్దార్ మల్లిఖార్జున్ ఉన్నారు.


