23 నుంచి బాలబ్రహ్మేశ్వర జాతర
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి బ్రహోత్సవాల్లో జాతరను విజయవంతం చేద్దామని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి సేవా సమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణంలోని హరిత హోటల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23న వసంత పంచమిని పురస్కరించుకొని జోగుళాంబ సేవా సమితి ఆధ్వర్యంలో గంటలేశ్వర ఆలయం నుంచి జోగుళాంబ అమ్మవారి ఆలయం వరకు జాతర ఊరేగింపు ఉంటుందన్నారు. గంటలేశ్వర ఆలయం నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమై టూరిజం హోటల్, గాంధీచౌక్, పోలీస్స్టేషన్ మీదుగా బాల బ్రహ్మేశ్వర ఆలయం సముదాయం నుంచి జోగులాంబ అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారని తెలిపారు. అనంతరం తుంగభద్ర బ్రిడ్జి సమీపంలో ఉన్న అష్టభుజి గంటలేశ్వర ఆలయం వద్ద అన్నప్రసాదం వితరణ ఉంటుందన్నారు. ఉత్సవాల్లో పలు సేవా సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షుడు సంజీవనాయుడు తెలిపారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, మాజీ ధర్మకర్త సభ్యుడు నరసింహారెడ్డి ఆలయంలో భక్తులు దర్శించుకోవడానికి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాధవి, శివానంద స్వామి, పట్టణ ప్రముఖులు, సుంకన్న, సత్యనారయణ, రమేష్ గుప్తా, ప్రశాంత్, నారయణ, బుజ్జీ, కేకే సత్యం, పోలీస్ చిన్నయ్య, రాజశేఖర్ శర్మ తదితరులు ఉన్నారు.


