మినీ మేడారం పనులు చేపట్టాలి
● అధికారులతో కలెక్టర్ సమీక్ష
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిర్వహించే మినీ మేడారం జాతర అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. మినీ మేడారం జాతరలపై సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాల నేపథ్యంలో కలెక్టర్ స్పందించి శుక్రవారం కలెక్టరేట్లోని మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్, విద్యుత్, ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, గిరిజన సంక్షేమశాఖ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులతో జాతరల నిర్వహణపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతర ప్రాంగణంలో పొదలు, పిచ్చిమొక్కలు తొలగించాలని, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని సూచించారు. జాతర సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. జాతరలు జరిగే మార్గాల్లో రోడ్లకు ఇరువైపులా పొదలు, పిచ్చిమొక్కలు తొలగించాలని, మలుపుల వద్ద సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు జాతర జరిగే ప్రదేశాలను పరిశీలించి చేయాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జాతరలు నిర్వహించే మండలాల్లో మండల ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మినీ మేడారం జాతరలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు ఇన్చార్జ్ కలెక్టర్ విజయలక్ష్మి, సీపీఓ బాబురావు, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారులు సునిల్, బాబురావు, విద్యుత్ శాఖ డీఈ రాజిరెడ్డి, ఆర్డీఓ హరికృష్ణ, డీఎల్పీఓ మల్లికార్జున రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
మినీ మేడారం పనులు చేపట్టాలి


