అన్ని సన్నాలకు బోనస్ ఇవ్వాలి
అధిక దిగుబడినిచ్చే రకాలే..
జనగామ రూరల్: వానాకాలం సీజన్లో కేవలం 7 రకాల సన్నరకం వడ్లకే బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు నిరాశకు గురి కావాల్సి వస్తోంది. గతేడాది 33 రకాల సన్నాల కు బోనస్ అందజేసి ప్రస్తుతం ఏడింటికే పరిమితం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుకు గాను ఈ మేరకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500లు బోనస్ చెల్లిస్తుంది. దీంతో రైతులు అత్యధికంగా సన్నాలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నా గతంతో పోల్చితే వాటి సంఖ్య తగ్గించడం సరైంది కాదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో ఈ సీజన్లో 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది 2.9 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్ నుంచి వ్యవసాయశాఖ అధికారులు ఏడు రకాల సన్నాలను ప్రకటించగా వాటిలో అత్యధిక దిగుబడి, చీడపీడలను తట్టుకొనే, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకోవడంలో సమస్యలు తలెత్తున్నాయి. గతేడాది రైతులకు ఎక్కువ సంఖ్యలో విత్తనాలు అందుబాటులో ఉండడంతో అధిక దిగుబడినిచ్చే విత్తనా లను ఎంపిక చేసుకున్నారు. ఈసారి అలాంటి అవకాశం లేకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. అయితే పంట సాగు అధిక దిగుబడిపై గ్రామాల్లో రైతు వేదికల్లో విత్తన మేళాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
7రకాలకు పెరిగిన డిమాండ్
ప్రభుత్వం ఏడు రకాల వరి వంగడాలకే బోనస్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లో ఆ విత్తనానికి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఆవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలు చేసింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్కు సుమారు 35 వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం కాగా 10 వేల వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, డిమాండ్కు సరిపడా నిల్వలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వివిధ వ్యాధిగ్రస్తులు వారు ముఖ్యంగా మధుమేహ బాధితులు తెలంగాణ సోనాను ఎంచుకుంటున్నారు. మార్కెట్లో అత్యధిక అదరణ పొందుతున్న సన్న బియ్యం సాంబమసూరి ఉంది. వరిసాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నా ఎక్కువ డిమాండ్ ఉన్న సన్నరకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు.
సన్న ధాన్యం వంగడాల రకాలు ఖరారు చేసిన అధికారులు
సూచించిన రకాలే వేయాలని
విత్తన మేళాల్లో విస్తృత ప్రచారం
రైతులకే ప్రయోజనం అంటున్న
అధికారులు
అన్ని రకాలకు బోనస్ ఇవ్వాలని
రైతుల డిమాండ్
జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో
వరి సాగు అంచనా
పంట రకం పంట కాలం(రోజులు)
బీపీటీ 52004 140 నుంచి 150
జైశ్రీరాం 130 నుంచి 135
ఆర్ఎన్ఆర్ 15048 120 నుంచి 125
హెచ్ఎంటీ (సోనా) 135 నుంచి 145
కేఎన్ఎం 7715 125 నుంచి 130
(కొత్తతరం సన్నరకం)
కేఎస్ఎం1638 120నుంచి 125
డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి) 140 నుంచి 145
ప్రభుత్వం రైతులు సాగు చేసే అన్ని రకాల సన్న ధాన్యానికి బోనస్ అందించాలి. సన్నాల సాగులో అదనపు పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు దిగుబడి తక్కువగా వస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన వాటికే కాకుండా ప్రభుత్వం అన్ని రకాల సన్నాలకు బోనస్ చెల్లించాలి. సూచించిన వాటినే సాగు చేయాలనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
–ఎడ్ల శ్రీనివాస్, రైతు, మరిగడి
రైతులకు ఉపయోగపడే విత్తనాలు, వానాకాలంలో అధిక దిగుబడి వచ్చే సన్నరకం వంగడాలను మాత్రమే ఎంపిక చేశాం. ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలు సాగుచేస్తే అమ్మకాల్లో సమస్యలు లేకుండా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. చీడపీడ బాధలు లేకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడితో పాటు అధికాదాయం పొందే అవకాశం ఉంది.
–అంబికా సోని, డీఏఓ


