● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: వాహనదారులు మైనర్లకు వాహనం ఇచ్చి రోడ్డు ప్రమాదాలకు కారణమై చట్టపరమైన చిక్కుల్లో పడొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ పోలీస్ అధికారి నిరంతరం కృషి చేయడంతోపాటు, ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనదారులకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో అధికంగా మైనర్ వాహనదారులు ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధులతో పాటు, ఓ బాలుడు మరణించగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం మైనర్ అతి వేగంగా వాహనం నడపడమేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ముఖ్యంగా మైనర్లకు వాహనం అందజేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో వాహన యజమాని, మైనర్ తల్లిదండ్రులు బాధ్యులుగా చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుకు తరలిస్తామని సీపీ హెచ్చరించారు.


