● 20 రోజులుగా నిలిచిన
మద్యం విక్రయాలు
● భారీ జరిమానా నిర్ణయించిన
జీపీ పాలకవర్గం
జఫర్గఢ్: గ్రామంలో విచ్చలవిడిగా బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాగుడుకు బానిసైన పలువురి కుటుంబాల్లో నిత్యం గొడవలు జరగుతున్నాయి. ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. ఇది గమనించిన రఘునాథ్పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం రెండు నెలల క్రితం గ్రామంలో బెల్టుషాపులు లేకుండా చేయాలని నిర్ణయింది. రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి గ్రామంలో బెల్టుషాపులను నిషేధిస్తూ తీర్మానం చేసింది. దీంతో 20 రోజుల నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. రఘునాథ్పల్లిలో 3 వేలకు పైగా జనాభా 1,765 మంది ఓటర్లు ఉన్నారు. జూన్ 1 నుంచి గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించి బెల్టుషాపుల నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. మద్యం విక్రయిస్తే రూ.లక్షా 25 వేల జరిమానా విధించనున్నట్లు గ్రామంలో దండోరా వేయించారు. ఎవరైనా మద్యం అమ్మినట్లుగా గుర్తించి ఆధారాలతో నిరూపిస్తే వారికి రూ.20 వేల రివార్డు ప్రకటించారు. ఎవరైనా మద్యంతాగి రోడ్లపై అల్లరి చేస్తే రూ.5 వేలు జరిమాన విధించేలా తీర్మానం చేశారు. దీంతో గ్రామంలో మద్యం విక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాన్ని ఆదర్శంగా మారుస్తాం..
జూన్ 1 నుంచి గ్రామంలో మద్యం విక్రయాలను నిషేధించాం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు సహకరిస్తున్నారు. మా పాలకవర్గం పదవిలో కొనసాగేంత వరకు గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మకాలు సాగించేది లేదు. ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.. జరిమానా విధిస్తాం. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం
– ఎడ్ల వెంకటయ్య, సర్పంచ్


